– పశ్చిమబెంగాల్ ఐద్వా ర్యాలీలో బృందాకరత్
కొల్కతా : పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ బీభత్సాన్ని ఎదుర్కొని మహిళలు సాగించిన పోరాటం యావత్ దేశానికే ఆదర్శమని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అఖిల భారత నాయకత్వం కొనియాడింది. మహిళా సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ శుక్రవారం రాణి రసమణి అవెన్యూలో ‘ప్రతిఘటన ర్యాలీ’కి పిలుపునిచ్చింది. ఆ ర్యాలీలో వక్తలుగా సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇదే అసలైన ప్రతిఘటన’ రోజు అని అభివర్ణించారు. ఇక్కడకు వచ్చిన వారిలో అమరవీరుల కుటుంబానికి చెందిన మహిళలు ఉన్నారు. తమ వారిని కోల్పోయి.. ద్ణుఖంలో ఉండి కూడా ఈ సభకు రావడానికి ధైర్యం చూపించారు. భవిష్యత్తులో పోరాటానికి అండగా ఉంటానని బృందాకరత్ వారికి భరోసా ఇచ్చారు. బెంగాల్ పోరాటం యావత్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.పంచాయతీ ఎన్నికల్లో మహిళల పాత్రను ప్రశంసిస్తూ బందా కారత్ మాట్లాడుతూ.. ”మీరు పంచాయతీ ఎన్నికల్లో పోరాడి అభ్యర్థులుగా నిలిచారు. ఓటు వేసే వరకు పోరాటంలోనే ఉన్నారు. రకరకాల చిత్రహింసల తర్వాత పోరాటాన్ని విరమించుకోలేదు. కొన్ని చోట్ల గెలిచారు. ఇంకొన్ని చోట్ల ఓడిపోయారు. కానీ సీపీఐ(ఎం) దృష్టిలో మీరు గెలిచారు” అని అన్నారు.రాష్ట్రంలో తృణమూల్, బీజేపీ శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడాలి. అంటే ”మీరు రెండు యుద్ధాలు చేయాలి” అని వివరించారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అలా జరగడం లేదు. ఢిల్లీలో రాజ్యాంగాన్ని మోడీ బుల్డోజర్ చేస్తున్నారు.పశ్చిబెంగాల్ లో మోడీ బుల్డోజర్ అయితే.. డ్రైవర్ సీటులో మమతా బెనర్జీ ఉన్నారని విమర్శించారు. వీరిద్దరూ ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్ చేస్తున్నారని తెలిపారు.
మహిళలు ఐక్యమై హక్కులను కాపాడేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం మరింత ఉధృతమవుతోందని వివరించారు. అక్టోబర్ 5న ఢిల్లీలో ర్యాలీ జరగనున్నదని, అక్కడ జరిగే ర్యాలీకి మహిళలంతా హాజరుకావాలని కోరారు.
ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కనినికా ఘోష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.’ఒకవైపు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. రూ. 400 ఉన్న గ్యాస్ ధర రూ.1,200లకు పెరిగింది. ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే..రూ.200 తగ్గించిందని వివరించారు. ”రాష్ట్రంలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది మహిళలకు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు అందడం లేదనీ, హక్కులపై దాడి జరుగుతోందని ఆరోపించారు. సమావేశంలో మరియం ధావలే, పీకే శ్రీమతి తదితరులు ప్రసంగించారు. జహనారా ఖాన్ అధ్యక్షత వహించారు. అంతకు ముందు నిర్వహించిన’ప్రతిఘటన ర్యాలీ’లో రసమణి రోడ్డు అంతా నినాదాలహౌరుతో దద్దరిల్లింది.