అమేథి నుంచి పోటీ చేసే అంశంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే…!

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్
అమేథి నుంచి పోటీ చేసే అంశంపై ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. 2004 నుంచి 2019 వరకు ఆయన అమేథి నుంచి పోటీ చేసి మూడుసార్లు గెలిచారు. కానీ 2019లో మాత్రం బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2019లో ఆయన అమేథితో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అమేథి నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ… వయనాడ్‌లో గెలిచారు. ఆయన ఇప్పటికే వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయనను మీడియా ప్రశ్నించింది. అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారా? అని ప్రశ్నించింది. ‘వెరీ గుడ్… మంచి ప్రశ్న, ఇది బీజేపీ వేసిన ప్రశ్న. మా పార్టీకి చెందిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలకు అనుగుణంగా నేను వ్యవహరిస్తాను. ఆ నిర్ణయాలు సీఈసీలో తీసుకుంటారు’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ… పదిహేను ఇరవై రోజుల క్రితం వరకు బీజేపీ 180 సీట్లు గెలుస్తుందని తాను భావించానని… కానీ ఇప్పుడు చూస్తుంటే 150 రావొచ్చునని మాత్రమే భావిస్తున్నానన్నారు. తమకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు వస్తున్నాయన్నారు. ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద దోపిడీ పథకమని విమర్శించారు.

Spread the love