గెలుపెవరిదో..?

Who won..?– సిట్టింగ్‌ సీటు కోసం కాంగ్రెస్‌ కసరత్తు
– పట్టు కోసం బీఆర్‌ఎస్‌ పాకులాట
– రాజకీయ భవిష్యత్‌ కోసం ఈటల ఆరాటం
– ‘మల్కాజిగిరి’ తీర్పు ఎప్పుడూ విలక్షణమే
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ సెగ్మెంట్‌ మల్కాజిగిరి. ఈ సెగ్మెంట్‌కు ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు ప్రతిసారీ విలక్షణమైన తీర్పునే ఇస్తూ వస్తున్నారు. రెండుసార్లు కాంగ్రెస్‌, ఒకసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ సెగ్మెంట్‌ పరిధిలో దాదాపు 37 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు 14 లక్షల వరకు సెటిలర్లు ఉన్నారు. గెలుపోటముల్లో సెటిలర్లే కీలక పాత్ర పోషించనున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించలేదు.
జాతీయ పార్టీలవైపే ఓటర్లు
పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2007లో సిద్దిపేట నుంచి విడిపోయి మల్కాజిగిరి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సగం హైదరాబాద్‌ నగరం ఇక్కడే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల ఓటర్లు మల్కాజిగిరి పరిధిలో ఉండటంతో వారు ఎక్కువగా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీని, రెండుసార్లు కాంగ్రెస్‌ను గెలిపించారు. గడిచిన మూడు ఎన్నికల్లో జాతీయ పార్టీలు, జాతీయ పార్టీల మిత్ర పక్షాలకు పట్టం కట్టిన మల్కాజిగిరి ఓటర్లు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారో అంతుచిక్కడం లేదు. గతం కంటే రాష్ట్రంలో రాజకీయాలు భిన్నంగా ఉండటంతో ఓటర్ల నాడి కోసం అభ్యర్థులు తీవ్ర కృషి చేస్తున్నారు.
14 లక్షల సెటిలర్‌ ఓటర్లు
ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి నివాసముండే వారు ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. ఓవైపు పారిశ్రామిక వాడలు, మరోవైపు మధ్యతరగతి నివాసయోగ్యమైన కాలనీలు, వ్యాపార సముదాయాలు ఉండటంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర భారతదేశానికి చెందిన ప్రజలు ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. దీంతో దేశంలో ఏ లోక్‌సభ నియోజకవర్గంలో లేని విధంగా ఓటర్ల సంఖ్య దాదాపు 37 లక్షలకు పైగా చేరింది. ఇందులో దాదాపు 14 లక్షల వరకు సెటిలర్లే ఉన్నారు.
ఈటలకు రాజకీయ భవిష్యత్‌..
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నికలు చావో.. రేవో అన్నట్టుగా మారాయి. ప్రస్తుతం ఈటల రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమిపాలు కావడంతో ఈటల గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఎంపీ ఫలితం కూడా వ్యతిరేకంగా వస్తే రాజకీయ భవిష్యత్‌ దెబ్బతింటుందనే భావనలో ఉన్న ఈటల, గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటమిని చవిచూసిన ఈటల తన రాజకీయ భవిష్యత్‌ను, సామాజిక అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఈటల అనూహ్య పరిస్థితుల్లో బీజేపీలో చేరడంతో రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.
అసెంబ్లీలో గెలిచి.. పార్లమెంట్‌లో..
ఉమ్మడి రాష్ట్రంలో కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఏ మాత్రమూ పట్టు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్‌ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. కాంగ్రెస్‌ చేతిలో ఓటమిపాలైంది. బీజేపీ సైతం రెండుసార్లు బరిలో నిలవగా ఒక్కసారి కూడా గెలుపొందలేదు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం 40 సీట్ల వరకు గెలిచింది. బీఆర్‌ఎస్‌ నాలుగోసారి, బీజేపీ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునితా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ బరిలో ఉన్నారు.
‘మల్కాజిగిరి’ తీర్పు విలక్షణం
మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు సార్లు కాంగ్రెస్‌, కూటమిలో భాగంగా ఒక్కసారి టీడీపీ గెలిచింది. ఇక్కడ మొదటి సారి 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో రెండోసారి నాటి ఎన్డీఏ కూటమి మిత్రపక్షమైన టీడీపీ అభ్యర్థిగా నేటి మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, 2019లో నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి, నేటి సీఎం రేవంత్‌ రెడ్డి గెలుపొందారు.

Spread the love