రిమ్స్‌లో వైద్యుల జాడేది?

రెండు విభాగాల్లోనే సేవలు
 అందని కార్డియో, యూరాలజీ, అంకాలజీ సేవలు
 ఈ నెల 15న వైద్యుల నియామకం కోసం కౌన్సెలింగ్‌ : డీఎంఈ
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా మారింది ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పరిస్థితి. పేదలకు వైద్యం అందించేందుకు ఏర్పడిన ఏడంతస్తుల భవనం అలంకార ప్రాయంగా మారుతోంది. ఆస్పత్రి ప్రారంభమై ఏడాది గడుస్తున్నా వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. కీలకమైన ఎనిమిది విభాగాల వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని పాలకులు, ఉన్నతాధికారులు పలుమార్లు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. మూడు నెలల కిందట ఐదు విభాగాల్లో ఘనంగా ప్రారంభించిన సేవలు అనతికాలంలోనే నిలిచిపోయాయి. నియామకమైన కొద్ది రోజులకే వైద్యులు వెళ్లిపోవడంతో ప్రస్తుతం రెండు విభాగాలు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఇది వరకు కూడా జిల్లా వాసులకు ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో నాణ్యమైన సేవలు లభిస్తాయా అనేది అనుమానంగా మారుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అప్పట్లో రిమ్స్‌ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2011లో రూ.150కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశాయి. అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిన నిర్మాణం రెండేండ్ల కిందట పూర్తయింది. కీలకమైన కార్డియాలజీ, యూరాలజీ, అంకాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, కార్డియోతొరాసిక్‌ సర్జరీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి ఎనిమిది కీలక విభాగాల్లో సేవలందించాలని సంకల్పించింది. తొలుత ఏడాది కిందట కార్డియో, అంకాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాల్లో సేవలు ప్రారంభించారు. సుమారు మూడు నెలలే కొన సాగిన ఈ సేవలు వైద్యులు అర్ధాంతరంగా వెళ్లిపోవ డంతో పూర్తిగా నిలిచి పోయాయి. అనం తరం అధికారులు వైద్యుల నియామ కాన్ని చేపట్టారు. ఐదుగురు వైద్యులు రావడంతో మళ్లీ మూడు నెలల కిందట సూపర్‌ సేవలు ప్రారం భిస్తున్నట్టు ప్రకటించారు. కానీ అనతికాలంలోనే కార్డి యాలజీ, యూరాలజీ, అంకాలజీ వైద్యులు వెళ్లిపోవడంతో మళ్లీ సూపర్‌ సేవలకు విఘాతం ఏర్పడింది. ఇక్కడి వాతావరణం అనుకూలించక పోవడం, తక్కువవేతనాలు ఇస్తుం డటమే వైద్యులు కొనసాగేం దుకు ఇష్టపడలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం రెండే విభాగాల్లో వైద్యం
వచ్చిన వైద్యులు వచ్చినట్టే వెళ్లిపోవడంతో పేదలకు సూపర్‌ స్పెషాలిటీలో నాణ్యమైన వైద్యం కలగానే మారుతోంది. సుమారు మూడు నెలలపాటు ఐదు కీలక విభాగాల్లో సేవలు లభించగా.. ప్రస్తుతం న్యూరోసర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాల్లోనే మాత్రమే సేవలు అందుతున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రి తరహా నిర్మించిన ఈ భవనంలో అన్ని రకాల సేవలు లభించేలా యంత్రాలు, పరికరాలు అమర్చారు. కేవలం వైద్యుల భర్తీనే సమస్యగా ఉంది. సాంతికేక సిబ్బంది, టెక్నీషియన్లు, తదితర అన్ని రకాల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. కానీ అవసరమైన వైద్యులు రావడం లేదు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండటంతో ప్రజలు గత్యంతరం లేక హైదరాబాదు, నాగ్‌పూర్‌, యవత్మాల్‌, నిజామాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.

డీఎంఈ పైనే భరోసా..!
రెండు నెలల కిందట జిల్లాకు వచ్చిన డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఎడ్యూ కేషన్‌ (డీఎంఈ) త్వరలోనే వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఇందుకు నెల 15న తేదీ నుంచి వైద్యుల నియా మకం కోసం కౌన్సెలింగ్‌ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆస్పత్రిలో ఎనిమిది విభాగాలు ఉండగా త్వరలో జరుగనున్న కౌన్సెలింగ్‌లో విభాగానికి ఇద్దరు చొప్పున కనీసం 16మంది వైద్యులైనా వస్తారని ఆశాభావం వ్యక్తం చేసు ్తన్నారు. ప్రస్తుతం 24 మంది సీనియర్‌ రెసి డెంట్లుగా పనిచేస్తున్నా పూర్తి స్థాయి వైద్యులు ఉంటేనే ప్రజలకు ఆరోగ్య సేవలపై భరోసా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైద్యుల నియామకం ఉంటుంది
ఈ నెల 15వ తేదీ నుంచి వైద్యుల నియామకం కోసం కౌన్సెలింగ్‌ ఉంటుంది. సూపర్‌ స్పెషాలిటీలో ఎనిమిది విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఇద్దరేసి చొప్పున 16మంది వైద్యులు వచ్చేందుకు ఆస్కారం ఉంది.
జైసింగ్‌ రాథోడ్‌,
రిమ్స్‌ డైరెక్టర్‌

Spread the love