ధ్వంసమైన గృహాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

– సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలోని మల్లాయిగూడెంలో ఆదివారం సంభవించిన భారీ గాలులకు నష్టపోయిన గృహ వాసులకు, బ్యారెన్‌ రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్‌ చేసారు. మల్లాయిగూడెం గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించి ధ్వంసం అయిన గృహాలను, బ్యారెన్‌ను పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్మత్స శ్రీనివాస రాజుకు చెందిన బ్యారెన్‌తో పాటు గెలలు దిగుబడి ఇచ్చే ఆయిల్‌ ఫాం వృక్షాలు సైతం గాలులకు నేలకొరిగాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. సారిన నాగేశ్వరరావు, పాగి సీతారాములు, గురివింద ముత్యాలు, మొడియం ధర్మయ్యకు చెందిన గృహాలు ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ గాలులకు లేచి పడిన ఇంటి రేకులతో ఇరువురు గాయాలు పాలయ్యారని అన్నారు. ధ్వంసం అయిన గృహ వాసులకు డబుల్‌ బెడ్‌ రూంలు నిర్మించాలని, బ్యారెన్‌ ధ్వంసం అయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆయన వెంట మండల కార్యదర్శి చిరంజీవి, స్థానిక కార్యకర్తలు ఉన్నారు.

Spread the love