– స్నేహ సంబంధాలను మరిచిపోలేం !
– కిస్సింగర్తో జిన్పింగ్ భేటీ
బీజింగ్ : చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గురువారం అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింగర్తో భేటీ అయ్యారు. కిస్సింగర్ ఇటీవలే వందో పుట్టిన రోజును జరుపుకున్నారని అంటూ ఇన్నేళ్ళలో వందకు పైగా సార్లు ఆయన చైనాలో పర్యటించారని జిన్పిం గ్ గుర్తు చేసుకున్నారు. ఈ రెండు వందలు కలిసి ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించాయని వ్యాఖ్యానించారు. ”52ఏళ్ళ క్రితం చైనా, అమెరికాలు కీలక దశలో వున్న సమయంలో చైనా నేతలు మావో జెడాంగ్, ప్రధాని ఝూవూ ఎన్లారు, అమెరికా నేతలు రిచర్డ్నిక్సన్, డాక్టర్ కిస్సింగర్ లు తమదైనఅసాధారణ వ్యూహాత్మక దార్శనికతతో ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకున్నారని జిన్పింగ్ పేర్కొ న్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించే క్రమాన్ని ప్రారంభి ంచారన్నారు. ఆనాటి నిర్ణయం ఇరు దేశాలకు ప్రయోజనాలు చేకూర్చిందని, ప్రపంచాన్ని మార్చిందని అన్నారు. స్నేహ సంబంధాలకు చైనా ప్రజలు విలువిస్తారన్నారు. ”మా పాత మిత్రులను మేం ఎన్నటికీ మరిచిపోం, అలాగే ఇరు దేశాల మద్య సంబంధాల వృద్ధికి కృషి చేసిన మీ విలువైన చారిత్రక సేవలను కూడా మరిచిపోలేం.” అని జిన్పింగ్ పేర్కొన్నారు. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచం చాలా వేగంగా మార్పు చెందుతోందని అన్నారు.అంతర్జాతీయంగా చాలా మార్పులు వస్తున్నాయన్నారు. చైనా, అమె రికాలు మళ్ళీ క్రాస్ రోడ్లో నిలుచున్నాయన్నారు. ఈ తరుణంలో మళ్ళీ ఇరు పక్షాలు మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.