రంజిత్‌ రెడ్డిని గెలిపించాలి

నవతెలంగాణ – సంతోష్‌నగర్‌
చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర చైర్మన్‌ తేజవాత్‌ బెల్లయ్య నాయక్‌ ప్రజలను కోరారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మరియు సలహాదారులు వేంనరేందర్‌ రెడ్డి ఆదేశానుసారం పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్‌ ఆదివాసి కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కేఎల్‌ఆర్‌ కార్యాలయం నందు ఆదివాసి కాంగ్రెస్‌ చేవెళ్ల ఇంచార్జి, రాష్ట్ర కోఆర్డినేటర్‌ గణేష్‌ రాథోడ్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తేజవాత్‌ బెల్లయ్య నాయక్‌తో పాటు మాజీ శాసనసభ్యులు కిచ్చేన్నగారి లక్ష్మారెడ్డి, తీగల అనిత రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రంగారెడ్డి జిల్లా రఘు నాయక్‌ రూడావత్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలోని లంబాడి, గిరిజనులు ఒకే తాటిపైకి వచ్చి, కాంగ్రెస్‌కు ఓటేసి దేశ ప్రధానిగా రాహుల్‌ గాంధీని ఎన్నుకోవాలని కోరారు.
బీజేపీకి ఓటు వేస్తే అన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తారని, అంతేకాదు రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని, మణిపూర్‌లో జరిగిన దహన కాండను దేశవ్యాప్తంగా చేస్తారని ఆరోపించారు. ఇప్పటివరకు లంబాడీలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఇంచార్జి నేరళ్ల శారద, మహమ్మద్‌ నిజాముద్దీన్‌ పాండు నాయక్‌, రాజు నాయక్‌, దశరథ్‌ నాయక్‌, కష్ణా నాయక్‌, గణేష్‌ నాయక్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love