మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, నూతన ప్రతిభను తెలుగు తెరకు పరిచయం చేస్తూ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయాలతో మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల భారీ చిత్రాలతోపాటు మరో పదికి పైగా సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈనెల 16న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ‘ఆదిపురుష్’తో పాటు తమ బ్యానర్లో రూపొందుతున్న సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
సంచలనాలు సృష్టిస్తుందని భావించాం
‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్గా ట్రైలర్ బాగుంది. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సష్టిస్తుందని మేం భావించాము. మార్కెట్ లెక్కలు వేసుకుని మంచి ధరకు ఈ సినిమా తెలుగు రైట్స్ని తీసుకున్నాం. భవిష్యత్లోనూ టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన ఉంటుంది. ప్రభాస్, సందీప్రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న ‘స్పిరిట్’ని కూడా తెలుగులో మేమే విడుదల చేస్తాం. ప్రభాస్తో మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే కాబోలు ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో నన్ను ఒక కుటుంబసభ్యుడు లాంటివారు అన్నారు. ఆయనతో అంత మంచి అనుబంధం ఏర్పడటం మా అదష్టం.
ఉచిత టికెట్లు పబ్లిసిటీ స్టంట్ కాదు
ప్రతి థియేటర్లో హనుమంతుడికి ఒక సీటు కేటాయించడం, పలువురు సెలబ్రిటీలు ఉచిత టికెట్లు ప్రకటించడం పబ్లిసిటీ స్టంట్గా అందరూ అనుకుంటున్నారు. అయితే వారు అనుకుంటున్నట్లుగా ఇది ఎంత మాత్రం పబ్లిసిటీ స్టంట్ కాదు. హనుమంతుడికి ప్రతి థియేటర్లో ఒక సీటు కేటాయించడం అనేది అది ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనం. ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో సెలబ్రిటీలు వారంతట వారు ముందుకొచ్చి చేస్తున్నారు. అలాగే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ నేడు (బుధవారం) ఓపెన్ అవుతాయి. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల పెంపు గురించి రెండు ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. మల్టీప్లెక్స్లలో ధర అలాగే ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్లో రూ.50 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. మేం రూ.25 పెంచాలి అనుకుంటున్నాం. పంపిణీదారులతో మాట్లాడి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం.
మా 25వ సినిమా ‘బ్రో’.
మా బ్యానర్లో 25వ సినిమా ‘బ్రో’ కావడం ఆనందంగా ఉంది. పవన్కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ వంటి రేర్ కాంబినేషన్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇకపై వేగంగా సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యాం. ఇందులో భాగంగా మా 50 వ సినిమా ప్రకటన మరో ఆరు నెలల్లో ఉండొచ్చు. అలాగే వచ్చే రెండు మూడేళ్ళలో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం అక్కడి టెక్నీషియన్స్ని తీసుకుంటున్నాం. త్వరలో పాన్ వరల్డ్ సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం.
నిర్మాణ దశలో 15 సినిమాలు..
ప్రభాస్-మారుతితో ఓ సినిమా చేస్తున్నాం. అంత పెద్ద సినిమాని అధికారికంగా ప్రకటించక పోవడానికి కారణమంటూ ఏమీ లేదు. ప్రతి సినిమాకి ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం. ఆ సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం సెట్స్ మీద దాదాపు 15 సినిమాలు ఉన్నాయి. వాటి ప్రకటన, ప్రమోషన్స్ విషయంలో వేటికవే ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయి. పరిశ్రమకు పలువురు కొత్త దర్శకులను కూడా పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎనిమిది, పది వరకు కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలే ఉన్నాయి.
అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం
ఎన్టీఆర్ శతజయంతికి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టడానికి అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నాం. కానీ కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మేలో విగ్రహం ఏర్పాటు చేయలేకపోయాం. త్వరలో ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.
జయాపజయాలకు అతీతంగా..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ని ఒక ఫ్యాక్టరీ మోడల్లోనే స్టార్ట్ చేశాం. అదష్టం కొద్దీ మాకు విజయాల శాతం ఎక్కువగానే ఉంది. కానీ సినిమా అనేది ఒక ప్రయాణం. ఇందులో పరాజయాలూ ఉంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని విజయం దిశగా పయనించడమే మా లక్ష్యం. నిర్మాణంలో భాగంగా ఎప్పటి మాదిరిగానే ఇతర బ్యానర్లతోనూ అసోసియేట్ అవుతాం.