మాదాపూర్‌లో డ్రగ్స్‌ కలకలం..ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అరెస్ట్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని కీలక నిందితుడు సోల్‌మెన్‌ నుంచి వీరు డ్రగ్స్‌ తీసుకొచ్చి.. రాజమహేంద్రవరంలో విద్యార్థులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుమారులని పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులకోసం బెంగళూరుకి వెళ్లి డ్రగ్స్‌ దందాలో దిగారని పేర్కొన్నారు. దర్యాప్తు నిమిత్తం డ్రగ్స్‌తో సహా నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

Spread the love