బీజింగ్: చైనా పట్ల అమెరికా శత్రుపూరిత వైఖరి తీసుకున్న నేపథ్యంలో అమెరికాలో తన కొత్త రాయబారిగా సీ ఫెంగ్ను చైనా నియమించింది. సీఫెంగ్ గతంలో చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రిగా పనిచేశారు. దశాబ్దాలుగా ఈ రంగంలో అపారమైన అనుభవం కలిగిన నిపుణుడిగా కూడా ఆయన పేరొందారు. ప్రస్తుతం పెళుసుగా ఉన్న చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచేందుకు సీ ఫెంగ్ నియామకం తోడ్పడుతుందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. సీఫెంగ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, చైనా ప్రజల ప్రతినిధిగా, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. చైనా, అమెరికా సంబంధాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో ప్రపంచ ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సున్నితమైన, ముఖ్యమైన సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తన వంతు కృషి చేస్తానని సీ ఫెంగ్ చెప్పారు.