వచ్చే ఐదేండ్లలో… 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి

రూ. 50 వేల కోట్ల టర్నోవర్‌
– 4  వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
– 8  కొత్త గనులు…
– దశాబ్ది ఉత్సవాల్లో సింగరేణి లక్ష్యాలు వెల్లడించిన సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌ సంస్థ గడచిన 9 ఏండ్లలో అద్భుత ప్రగతి సాధించిందనీ, అదే ఒరవడిని కొనసాగిస్తూ వచ్చే ఐదేండ్ల లక్ష్యాలను నిర్థారించు కున్నామని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌ తెలిపారు. వచ్చే ఐదేండ్లలో వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి. 8 కొత్త గనులు ప్రారంభించి రూ. 50 వేల కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. హైదరాబాద్‌ సింగరేణిభవన్‌లో సోమవారం సింగరేణి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత సంస్థ సాధించిన ప్రగతిని వివరించా రు. ఇతర రాష్ట్రాల్లోకీ సంస్థ విస్తరిస్తు న్నదని తెలి పారు. ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బ్లాక్‌ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తున్నామనీ, వచ్చే ఏడాది నుంచి 10 మిలియన్‌ టన్నుల బొగ్గును అక్కడ ఉత్పత్తి చేస్తామన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యు త్‌ కేంద్రాన్నీ, 224 మెగావాట్ల సోలార్‌ విద్యు త్తును కూడా రాష్ట్ర అవసరాలకు అందిస్తున్నా మన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సన్మానం చేశారు. ఎన్‌సీడబ్ల్యుఏ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ శ్రీమతి సీహెచ్‌ నాగమణి, సెక్యూరిటీ గార్డు ఉబయదుల్లా, అధికారుల విభా గంలో డీజీఎం చక్రధర్‌రావు, ఎస్వోఎం కష్ణాచారి లను సన్మానించారు. ఈ సందర్భంగా రూపొందిం చిన డాక్యుమెంటరీ, ప్రగతి పుస్తకంతో పాటు ప్రముఖ కవి, సింగరేణి ఉద్యోగి జయరాజు రాసిన గీతాన్ని సీఎమ్‌డీ ఆవిష్కరించారు.

Spread the love