– కేసీఆర్ జగన్తో కుమ్మక్కై ప్రాజెక్టులను ఎండబెట్టిండు
– పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే తప్పుకుంటా..
– మాట నిలబెట్టుకుంటే డొక్కు కారును అమ్మి షెడ్లో కూర్చుంటావా కేసీఆర్ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
– రఘువీర్రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు
– ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ విఫలం
– ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్కు మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– సీపీఐ(ఎం), సీపీిఐ మద్దతు కోరిన రఘువీర్ రెడ్డి
– ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కేసీఆర్ జగన్తో కుమ్మక్కై ప్రాజెక్టులను ఎండబెట్టిండు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా.. మేము మాట నిలబెట్టుకుంటే డొక్కు కారును అమ్మి షెడ్డులో కూర్చుంటావా కేసీఆర్” అని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నామినేషన్ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను ఎండబెట్టిందని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటివారు నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను కట్టి లెఫ్ట్ కెనాల్ ద్వారా నీరు అందించి ఆదుకుంటే.. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైన కేసీఆర్ ప్రాజెక్టులను ఎండబెట్టారని ఆరోపించారు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన పైసా పని చేయని పనికిమాలిన వాని గురించి మాట్లాడానని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. టీన్యూస్ ఛానల్లో ఎవరూ చూడాలని టీవీ9కి వచ్చి నాలుగు గంటలసేపు కేసీఆర్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుందంటున్న కేసీఆర్.. అసలు ఆడవాళ్లు మద్యాన్ని అమ్ముతారా అని ప్రశ్నించారు.
10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు, ఇల్లు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, మహిళలకు 2500 రూపాయలను ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎంతో పాటు మంత్రులమంతా టీమ్గా పని చేస్తున్నామని, పదేండ్లు అధికారంలో ఉంటామని, సీఎం రేవంత్ రెడ్డినే ఉంటారని అన్నారు. రెండేండ్లలో ప్రతి ఊరునూ బంగారంలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడ పోటీలో ఎవరూ లేరని, పోటీ అంటే స్వర్గంలో ఉన్న రావి నారాయణరెడ్డినే అని వ్యాఖ్యానించారు. గతంలో ఆయనకు పట్టం కట్టినట్టు అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రూ.700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం, రూ.280 కోట్లతో ఆర్ అండ్బీ రోడ్ల నిర్మాణం, రూ.400 కోట్లతో నల్లగొండ మున్సిపాలిటిని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నల్లగొండలో బీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్ దక్కదన్నారు. మోడీ నాయకత్వంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనన్నారు. కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ, డిండి, బీ వెల్లెంలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత అవసరమైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. మిల్లర్లు తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో భాగంగా బీజేపీ ఓటమి లక్ష్యంగా.. కాంగ్రెస్కు ఇక్కడ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలలో మార్పులు చేసిందని, ఉపాధి హామీ నిధులను తగ్గించిందని చెప్పారు. దేశ ప్రధాని స్వయంగా మతాల మధ్య విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
నామినేషన్ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సీపీఐ(ఎం), సీపీఐ మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.