– 4-2తో పెనాల్టీ షూటౌట్లో పైచేయి
– ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్
లండన్ : ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ 2023 లండన్ లీగ్ దశను టీమ్ ఇండియా ఘనంగా ముగించింది. పెనాల్టీ షూటౌట్కు దారితీసిన మ్యాచ్లో 4-2తో బ్రిటన్పై ఘన విజయం సాధించిన హాకీ ఇండియా.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం నిలబెట్టుకుంది. నాలుగు క్వార్టర్ల అనంతరం మ్యాచ్ 4-4తో సమమైంది. దీంతో ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్తో తేల్చారు. ఆట మొదలైన ఆరో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ దక్కించుకున్న భారత్ 1-0తో ముందంజ వేసింది. హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీని అలవోకగా గోల్గా మలిచాడు. ఏడో నిమిషంలో పెనాల్టీ కార్నర్ సాధించిన బ్రిటన్.. 1-1తో స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో రెండు గోల్స్ కొట్టిన భారత్ 3-1తో ఆధిక్యం సాధించింది. మన్దీప్ సింగ్ (18వ నిమిషం), సుఖజిత్ సింగ్ (27వ నిమిషం) ఫీల్డ్ గోల్స్తో అదరగొట్టారు. చివరి రెండు క్వార్టర్లలో రెచ్చిపోయిన బ్రిటన్ 39, 46వ నిమిషాల్లో గోల్స్ కొట్టి స్కోరు సమం చేసింది. 49వ నిమిషంలో అభిషేక్ మరో ఫీల్డ్ గోల్తో భారత్ను 4-3తో ముందంజలో నిలిపాడు. అయినా, 52 నిమిషంలో గోల్తో బ్రిటన్ స్కోరు సమం చేసింది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున అభిషేక్, లలిత్ కుమార్, హర్మన్ప్రీత్ సింగ్, మన్ప్రీత్ సింగ్ విజయవంతంగా గోల్స్ నమోదు చేశారు. బ్రిటన్ తరఫున ఇద్దరు గోల్స్ కొట్టగా.. ఇద్దరు విఫలమయ్యారు. ఐదో పెనాల్టీ షూట్ అవసరం లేకుండానే భారత్ మెరుపు విజయం నమోదు చేసింది.