అచ్చంగా ఐదు పుస్తకాల ఆవిష్కరణ
అచ్చంగా ఐదు పుస్తకాల ఆవిష్కరణ సభ ఈ నెల 27వ తేదీ హైదరాబాద్ కొత్తపేటలోని స్పైసీహబ్ హోటల్లో జరుగుతుంది. నాలుగు సెషన్లుగా జరిగే ఈ సభలో ‘చిత్రకళా తపస్వి డా||కొండపల్లి శేషగిరిరావుకి జీవన్ గాథా’ హిందీ అనువాద గ్రంథం ఆవిష్కరణ, డా||కొండపల్లి నీహారిణి ‘అనివార్యం’ పుస్తకావిష్కరణ, మయూఖ అంతర్జాల పత్రిక కథా సంకలనాలు ‘కథా మయూఖం, బాలకథా మయూఖం’ ఆవిష్కరణ, ‘ధూళిపాల అరుణ కథా సంపుటి ‘మిగిలేవి గురుతులే’ ఆవిష్కరణ వుంటుంది.
డా||కొండపల్లి నీహారిణి
రాష్ట్ర స్థాయి సదస్సు – సమూహ
ఈ నెల 28న వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో లౌకిక విలువలు – సాహిత్యం అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. ఈ సభలో యాకుబ్, లోచన్, నందిని సిధారెడ్డి, రూపారుక్మిణి, మెట్టు రవీందర్, గుంటూరు లక్ష్మీ నరసయ్య, జిలుకర శ్రీనివాస్, యస్. మల్లారెడ్డి, పసునూరి రవీందర్, సౌదారుణ, కాత్యాయనీ విద్మహే, సిద్దంకి యాదగిరి, నరేష్ కుమార్ సూఫీ, మెర్సీ మార్గరెట్… తదితరులు పాల్గొంటారు.
‘కరోనా’ సాహిత్యం
‘తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం’ అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. ‘కరోనా’ విషమ కాలాన్ని రికార్డు పరిచి భవిష్యత్ తరాలకు అందించేందుకు కరోనాపై వివిధ పత్రికలలో వచ్చిన కథ/ కవిత/ నవల/ వ్యాసం, ప్రత్యేక సంపుటాలు, సంకలనాలు తదితర వివరాలను 9247475975 వాట్సాప్ నెంబరుకు తెలియ చేయవలసిందిగా సాహితీ వేత్తలనందర్నీ కోరుతున్నాను. – చలపాక ప్రకాష్
బాల సాహిత్య సమ్మేళనం 2024
తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మే 29,30 తేదీల్లో హైదరాబాద్లో బాల సాహిత్య సమ్మేళనం జరుగుతుంది. ఇందులో పాఠశాలస్థాయిలో తెలుగు భాషా వికాసం, బడి పిల్లల్లో రచనాభిరుచి పెంపొందించడం, పత్రికల్లో బాలల రచనలకు ప్రచురణావకాశాలు, కథలు చెప్పడంలో మెలకువలు, సంగీతం, నత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పం వంటి లలితకళల పైన ప్రాథమిక అవగాహన మొదలైన సదస్సులు, గోష్టులు జరుగుతాయి. ఇందులో పాల్గొన దలచిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తలు పాల్గొనదలిచేవారు ఈ నెల 30 వ తేదీలోగా 9603727234 వాట్సాప్ నెంబర్కు వివరాలు పంపి పేర్లు నమోదు చేసుకోవాలి.
– ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా.జె.చెన్నయ్య