జైలు గోడలు బద్దలు కొట్టి..ఖైదీల పరార్‌

– హైతీ దేశ రాజధాని పోర్ట్‌ ఆ ప్రిన్స్‌లో ఘటన
– మీడియాకు ఆ దేశ పోలీస్‌ యూనియన్‌ సోషల్‌ పోస్టు
హైతీ:
”తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే ప్రధాన జైలులో ఖైదీల ముఠాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. జైలు గోడలు బద్దలు కొట్టుకొని వందల మంది ఖైదీలు పారిపోతున్నారు. దీంతో హైతీ దేశ రాజధాని పోర్ట్‌ ఆ ప్రిన్స్‌ రణరంగాన్ని తలపిస్తోంది” అని ఆ దేశ పోలీస్‌ యూనియన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. రాజధానిలోని అధికారులందరూ తక్షణమే కార్లు, ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించింది. అంతేకక ”దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 3,000 మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారు. ఎవరినీ వదిలిపెట్టరు” అని దానిలో పేర్కొంది. కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి హైతీ ప్రధాని
ఏరియల్‌ హెన్రీ ఇటీవల ఆ దేశ పర్యటనకు వెళ్లిన సమయంలో పోర్ట్‌ ఆ ప్రిన్స్‌లో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టాయి. దీంతో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. అదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ ఆ ప్రిన్స్‌ జైలుపై దాడులు మొదలయ్యాయి. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతో పాటు 18 మంది కొలంబియా నేరగాళ్లు కూడా ఉన్నారు. ఈ జైలు సామర్థ్యం కేవలం 3,900 మంది ఖైదీలుండేది కాగా.. ఇప్పుడు అందులో 11,778 మంది ఖైదీలు ఉన్నారు. ఈ క్రమంలోనే జైలుపై బయటి నుంచి ఓ ముఠాకు చెందిన దుండగులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాజ్‌-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే.. ఆ దేశ దళాలు హైతీ రక్షణకు సాయం చేస్తాయి. దీనిపై ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ మాట్లాడుతూ.. ప్రధాని హెన్రీని పదవి నుంచి దించుతామన్నాడు. ‘పోలీసులు, సైన్యమే ప్రధానిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాడు. కాగా, జిమ్మీ గతంలో పోలీస్‌ అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత గ్యాంగులతో సంబంధాలు పెట్టుకొని నేరగాడిగా మారాడు. అతడిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి.

Spread the love