తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా జై హనుమాన్‌

Hanumanడైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్‌ పూర్తి చేసుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలో ఆల్‌ టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. హనుమాన్‌ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా సెలబ్రేషన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ,’హనుమన్‌ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్‌ మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. నేను డైరెక్టర్‌ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్‌ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్‌లో వందవ రోజు కూడా థియేటర్స్‌కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదష్టంగా ఫీలౌతున్నాను. పీవీసియుకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్‌ చేయబోతున్నాను. ఈ యూనివర్స్‌లో మీరు చేసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి. సముద్రఖని విభీషుడిగా కనిపించబోతున్నారు. తేజ హను- మాన్‌గా కొనసాగుతారు. కొన్ని సర్‌ప్రైజ్‌ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియులో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్‌ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలే కాదు, తెలుగు ఆడియన్స్‌ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను. జైహనుమాన్‌ని బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్‌ కనెక్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌ అన్నీ ఉంటాయి’ అని తెలిపారు.

Spread the love