దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరనే వార్తను తెలుగు ప్రేక్షకులు ఇంకా పూర్తిగా జీర్ణించుకోకముందే ఆయన ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) కన్నుమూశారు. ఆదివారం ఆమె తీవ్ర అస్వస్థతకు లోనై గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన కొద్దిసేపటికే ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈనెల 2న దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు కూతురు పద్మావతివిశ్వనాథ్, కొడుకులు నాగేంద్రనాథ్ విశ్వనాథ్, రవీంధ్రనాథ్ విశ్వనాథ్ ఉన్నారు. జయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.